
మొదటి నుంచి విశాల్ మాస్ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. అడపా దడపా లుక్ పరంగా కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు. అలా ఆయన ద్విపాత్రాభినయం చేసిన 'మార్క్ ఆంటోని' సినిమా ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. ఇక తన సినిమా హిట్ అయినా .. ఫ్లాప్ అయినా వెంటనే మరో ప్రాజెక్టుపైకి వెళ్లిపోవడం విశాల్ కి అలవాటు.
అలా ఆయన తన 34వ సినిమాకి సంబంధించి రంగంలోకి దిగిపోయాడు. స్టోన్ బెంచ్ - జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో హరి - విశాల్ కాంబినేషన్లో వచ్చిన 'భరణి' .. 'పూజ' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందువలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లోరూపొందుతున్న ఈ సినిమాలో, ప్రియా భవాని శంకర్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాలో సముద్రఖని .. గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. మరో దర్శకుడు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
|