
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిన్న ఉదయం పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ద్వారా 7 సింగపూర్ శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లో విజయవంతంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. కాగా, ఈ ప్రయోగం సందర్భంగా పీఎస్ఎల్వీ రాకెట్ శకలం ఒకటి పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో పడింది. స్థానికులు ఇదేదో వింత వస్తువు అని భావించారు.
అయితే, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఇది భారత రాకెట్ శకలం అని పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
"పశ్చిమ ఆస్ట్రేలియాలోని జూరియన్ బే సమీపంలోని ఓ బీచ్ వద్ద ఓ వస్తువును గుర్తించాం. ఇది బహుశా పోలార్ శాటిలైల్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) మూడో దశ నుంచి విడవడిన శకలం అయ్యుంటుందని భావిస్తున్నాం. ఇస్రో వినియోగించే మధ్య శ్రేణి రాకెట్... పీఎస్ఎల్వీ. జూరియన్ బే బీచ్ లో లభ్యమైన వస్తువును భద్రపరిచాం. దీనిపై ఇస్రోతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష నిబంధనలను అనుసరించి ఏంచేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆస్ట్రేలియన్లు ఎవరైనా ఇలాంటివే ఏవైనా వస్తువులను గుర్తిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి" అంటూ వివరించింది.
|